వింబుల్డన్‌ టోర్నమెంట్‌ రద్దు

2 Apr, 2020 00:48 IST|Sakshi

లండన్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులదృష్ట్యా...  ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్‌టెన్నిస్‌ క్లబ్‌ (ఏఈఎల్‌టీసీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ జూన్‌ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది. వచ్చే ఏడాది వింబుల్డన్‌ టోర్నీ జూన్‌ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్‌టీసీ తెలిపింది.

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వింబుల్డన్‌ టోర్నీని 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్‌ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింబుల్డన్‌ టోర్నీ రద్దు కావడంతో జూలై 13 వరకు ఎలాంటి టెన్నిస్‌ టోర్నీలు లేవని అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ), మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) తెలిపాయి.   

మరిన్ని వార్తలు