రెండో టి20లో విండీస్ పరాజయం
ఫ్లోరిడా (అమెరికా): తొలి టి20లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ వెంటనే తేరుకొని రెండో మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో బంగ్లా 12 పరుగుల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తమీమ్ ఇక్బాల్ (44 బంతుల్లో 74; 6 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ షకీబుల్ హసన్ (38 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ప్రత్యర్థి బౌలర్లలో నర్స్, కీమో పాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లా బౌలర్లు నజ్ముల్ ఇస్లామ్ (3/28), ముస్తఫిజుర్ (3/50), షకీబ్ (2/19) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన విండీస్ చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమి పాలైంది.