కేవలం మూడు టి20 మ్యాచ్లే
కరాచీ: పాకిస్తాన్లో వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. కేవలం మూడు టి20 మ్యాచ్లకే ఈ సిరీస్ పరిమితమైందని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ‘మా దేశంలో ఆడేందుకు వెస్టిండీస్ సమ్మతించింది. ఈ నవంబర్లో ముఖాముఖి సిరీస్ జరుగుతుంది. ఇరు జట్ల మధ్య లాహోర్లోనే మూడు టి20 మ్యాచ్లు జరుగుతాయి’ అని పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ తెలిపారు. మ్యాచ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
శ్రీలంక కూడా ఏకైక టి20 మ్యాచ్ ఆడేందుకు తమ దేశానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 29న లాహోర్లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. 2009లో లాహోర్లో లంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆ దేశంలో ఇప్పటివరకు అంతర్జాతీయ అగ్రశ్రేణి జట్లు పర్యటించలేదు.