పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. చెలరేగిన భారత బౌలర్లు

9 Jun, 2018 08:55 IST|Sakshi

నిర్ణీత 20 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేసిన పాక్‌

స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఫైనల్‌కు భారత్‌

కౌలాలంపూర్‌ : మహిళా ఆసియా కప్‌ టీ-20 సిరీస్‌లో భాగంగా మలేసియాలో దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 73 పరుగుల స్వల్ప లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఇటు భారత్‌, అటు పాకిస్థాన్‌ జట్లు చెరో మూడు విజయాలు సాధించాయి.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. చావో-రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఏక్తా బిష్త్‌ తన నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీసుకుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి పాక్‌ వుమెన్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టడానికి నానాతంటాలు పడ్డారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భారత మహిళా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ.. పాక్‌ జట్టును 72 పరుగులకు పరిమితం చేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి.. భారత్‌ జట్టు ఆసియా కప్‌ ఫైనల్‌ చేరే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు