‘ఇంకా వరల్డ్‌ చాంపియన్‌ కాలేదు కదా’

30 Mar, 2020 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ:  పురుషుల, మహిళల క్రికెట్‌ను సమాన దృష్టితో  చూడాలని ఇటీవల భారత మహిళా క్రికెట్‌ జట్టు వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చేసిన వ్యాఖ్యల్ని మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా ఖండించారు.  అసలు ఆ డిమాండే అనైతికమన్నారు. పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను ఎందుకు సమానంగా చూడాలంటూ ప్రశ్నించారు. ఇంకా వరల్డ్‌కప్‌ లాంటి ఎటువంటి మెగా టైటిల్‌ను గెలవని భారత మహిళా క్రికెట్‌ జట్టు.. పురుషుల క్రికెట్‌ జట్టుతో సమానంగా చూడాలంటూ డిమాండ్‌ చేయడం సరైనది కాదని అంజుమ్‌ చోప్రా అభిప్రాయ పడ్డారు.  (ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా..)

మన మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులు.. మరొక మహిళా క్రికెట్‌ జట్టు  సభ్యులతో పోల్చుకోవాలని సూచించారు. ఇక్కడ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టుతో భారత మహిళా జట్టు పోల్చుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. ‘ నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఈ సమయంలో పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను సమానంగా చూడాలనే చర్చ ఎందుకు వచ్చినట్లు.  భారత మహిళా క్రికెట్‌ జట్టు ఇప్పటివరకూ వరల్డ్‌కప్‌ గెలవలేదు. భారత మెన్స్‌ జట్టు వరల్డ్‌కప్‌ సాధిస్తే, మహిళలు ఇంకా ఎటువంటి మేజర్‌ ట్రోఫీని సాధించలేదు కదా. మరి పోలిక ఎందుకు’ అని అంజుమ్‌ చోప్రా పేర్కొన్నారు. బీసీసీఐ ఇటీవల  కాంట్రాక్ట్‌ల ప్రకారం.. గ్రేడ్‌-ఎ మహిళా క్రికెటర్లకు రూ. 50లక్షలు వార్షిక వేతనం వస్తుండగా, అదే కేటగిరీలో ఉన్న  మెన్స్‌ జట్టు  సభ్యులకు రూ. 5 కోట్లు వస్తుంది. ఇక ఎ+ కేటగిరీలో ఉ‍న్న పురుష క్రికెటర్లకు రూ. 7 కోట్లు వార్షిక ఆదాయం లభిస్తుంది. (ధోని టార్గెట్‌ రూ. 30 లక్షలే..)

మరిన్ని వార్తలు