సింధు ముందుకు...

28 Aug, 2014 01:57 IST|Sakshi
సింధు ముందుకు...

ప్రి క్వార్టర్స్‌లో హైదరాబాదీ
- శ్రీకాంత్ కూడా...
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
కోపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో ‘బై’ లభించిన ఆమె బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. గత ఏడాది ఈ టోర్నీలో కాంస్యం గెలుచుకున్న సింధు 21-12, 21-17 స్కోరుతో ఓల్గా గొలోవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-13తో రాజీవ్ ఓసెఫ్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. మరో ఆటగాడు. అజయ్ జైరాం రెండో రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన టనోంగ్‌సక్ చేతిలో 17-21, 14-21తో ఓడిపోయాడు.
 
జ్వాల-అశ్విని జోడి నిష్ర్కమణ: మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. భారత ద్వయంపై ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్లీ జావో (చైనా) జోడి 21-16, 21-8తో ఘన విజయం సాధించింది. మరో వైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి (భారత్) జోడి మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా...ప్రణవ్ చోప్రా- అక్షయ్ దివాల్కర్ జంట నిష్ర్కమించింది. మను-సుమీత్ 21-19, 21-19తో 15వ సీడ్ హషిమొటో-హిరాటా (జపాన్)పై విజయం సాధించారు. అయితే ప్రణవ్-అక్షయ్ ద్వయం ఐదో సీడ్ జుంగ్ కిమ్-రంగ్ కిమ్ (కొరియా) చేతిలో 15-21, 17-21తో ఓటమిపాలైంది.

మరిన్ని వార్తలు