స్వర్ణాలు నెగ్గిన గుకేశ్, సవితశ్రీ 

17 Nov, 2018 02:35 IST|Sakshi

ప్రపంచ క్యాడెట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత చెస్‌ క్రీడాకారులు మెరిశారు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌ –12 ఓపెన్‌ విభాగంలో డి.గుకేశ్‌... బాలికల విభాగంలో సవితశ్రీ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత గుకేశ్‌ 10 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చెన్నైకు చెందిన 12 ఏళ్ల గుకేశ్‌ కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుకేశ్‌ మొత్తం పది విజయాలు సాధించి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు.

అండర్‌–12 బాలికల విభాగంలో చెన్నై అమ్మాయి సవితశ్రీ 10 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆమె తొమ్మిది గేమ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో అండర్‌–8, అండర్‌–10, అండర్‌–12 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. 86 దేశాల నుంచి 861 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్‌గా చైనా రెండు స్వర్ణాలు, కాంస్యంతో తొలి స్థానంలో నిలువగా... రెండు స్వర్ణాలతో భారత్‌ రెండో స్థానంలో... స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. 

మరిన్ని వార్తలు