ఉక్రెయిన్‌ను నిలువరించిన భారత్

22 Apr, 2015 01:14 IST|Sakshi

ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్

చెంగ్డూ (చైనా) : ప్రపంచ చాంపియన్స్‌తో కూడిన టాప్ సీడ్ ఉక్రెయిన్ జట్టును నిలువరిస్తూ.... భారత మహిళల జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత్, ఉక్రెయిన్ జట్లు 2-2 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ అన్నా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... క్లాసిక్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.

ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినాతో జరిగిన గేమ్‌లో పద్మిని రౌత్ 52 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరిదైన నాలుగో గేమ్‌లో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ సౌమ్య స్వామినాథన్ 71 ఎత్తుల్లో నటాలియా జుకోవా చేతిలో ఓడిపోవడంతో భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరో ఆరు రౌండ్‌లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత్ రెండు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. బుధవారం జరిగే నాలుగో రౌండ్‌లో రష్యాతో భారత్ ఆడుతుంది.

మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయింది. బోరిస్ గెల్ఫాండ్‌తో పెంటేల హరికృష్ణ తన గేమ్‌ను 27 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఎవగెని పోస్ట్‌నీపై దీప్ సేన్‌గుప్తా గెలిచాడు. అయితే సేతురామన్ 28 ఎత్తుల్లో సుటోవ్‌స్కీ చేతిలో; శశికిరణ్ 35 ఎత్తుల్లో సిమిరిన్ చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత ఓటమి ఖాయమైంది.

మరిన్ని వార్తలు