పాక్‌ చెత్త ఫీల్డింగ్‌.. రోహిత్‌ సేఫ్‌

16 Jun, 2019 16:41 IST|Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. శతక భాగస్వామ్యంతో పాక్‌పై నయా చరిత్ర సృష్టించారు. ఓపెనర్లలో ముఖ్యంగా రోహిత్‌ శర్మ అర్దసెంచరీతో తన ఫామ్‌ను కోనసాగించాడు. అయితే భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్బంగా పదో ఓవర్‌లో పాక్‌ చెత్త ఫీల్డింగ్‌ పుణ్యమా అని రోహిత్‌ ఔట్‌ కాకుండా బతికిపోయాడు.

పాక్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ వేసిన పదో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కొన్న రాహుల్‌ మిడ్‌ వికెట్‌వైపు తరిలించి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రాహుల్‌ అంతగా ఆసక్తి లేకున్నా రోహిత్‌ అనవసరంగా రెండో రన్‌ కోసం క్రీజు మధ్యలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఫఖర్‌ జామన్‌ తొందరలో బంతిని కీపర్‌కు కాకుండా రెండో ఎండ్‌కు విసిరేశాడు. దీంతో అప్రమత్తమైన రోహిత్‌ వెంటనే తిరిగి క్రీజులోకి వెళ్లాడు. అయితే ఫఖర్‌ బంతిని కీపర్‌కు అందించి ఉంటే రోహిత్ కచ్చితంగా ఔటయ్యేవాడు. అయితే పాక్‌ చెత్త ఫీల్డింగ్‌తో రోహిత్‌ ఔట్‌ కాకుండా ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో పాక్‌ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు రోహిత్‌ 32 పరుగులు మాత్రమే సాధించాడు. 

>
మరిన్ని వార్తలు