లండన్: ప్రపంచకప్ 2019 కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు ఆటగాళ్లు ఆటవిడుపు కోసం నగరం వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. అన్ని జట్ల సారథులతో ఫోటో షూట్లో పాల్గొని, చిట్ చాట్ చేశారు. అలాగే కొంత మంది ఆటగాళ్లు సేదతీరడం కోసం లండన్ వీధుల్లో విహరిస్తున్నారు. ఈ సమయంలోనే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చాలెంజ్లో పాల్గొన్నాడు. అయితే ఆ చాలెంజ్లో హిట్ మ్యాన్ ఓడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం రోహిత్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ స్టడీ హ్యాండ్ చాలెంజ్లో ఓడిపోయాడు. అదేంటంటే.. ఎత్తుపల్లాలు కలిగిన ఒక ఆటవస్తువును ఒక వైపు నుంచి మరొకవైపుకు చేతితో పట్టిన రింగుతో తాకుండా ఆడాలి. ఈ ఆటతో ఏకాగ్రత, స్థిరత్వం ఏ మేరకు ఉందో తెలుస్తుంది. అయితే రోహిత్ మూడు పల్లాలను దాటి నాలుగో దానికోసం ప్రయత్నిస్తుండగా రింగు ఆ వస్తువుకు తగలడంతో ఓడిపోయాడు. ఇక ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో టీమిండియా వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. కోహ్లి సేన ప్రపంచకప్ అసలు పోరును జూన్ 5న దక్షిణాప్రికాతో ప్రారంభించనుంది.