పాక్‌ గెలుపుపై సానియా ట్వీట్‌

4 Jun, 2019 22:14 IST|Sakshi

హైదరాబాద్‌: సంచలనాలకు మారుపేరైన పాకిస్తాన్‌ మరోసారి ఎవరి అంచనాలకి అందదని నిరూపించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఘోరం ఓడిపోయిన పాక్‌ తన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై అనూహ్య విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌పై పాకిస్తాన్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ జట్టుని ఆ దేశ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విటర్‌ వేదికగా పాక్‌ జట్టుకు అభినందనలు తెలిపారు. 

‘పాకిస్థాన్ జట్టుకు అభినందనలు. ఓ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన అనంతరం పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి రుజువైంది. పాక్‌ గెలుపు బాట పట్టడంతో ప్రపంచకప్‌ మరింత ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు’అంటూ ట్వీట్‌ చేశారు. ఇక సానియా ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ‘జూన్‌ 16న జరిగే మ్యాచ్‌ ఫలితం గురించి కూడా ట్వీట్‌ చేయాలి. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో పాక్‌పై కోహ్లి సేన గెలుస్తుంది. టీమిండియాను పొగుడుతూ కామెంట్‌ చేయడం మర్చిపోకు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

కాగా చివరిగా ఆడిన 11 వన్డేల్లోనూ పాక్‌ ఓడింది. దీంతో.. సుదీర్ఘ విరామం తర్వాత గెలుపు రుచి చూడడంతో పాక్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 16న భారత్‌-పాక్‌ల మ్యాచ్‌ జరగనుంది. అయితే ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు