తొలి వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి

25 May, 2019 21:28 IST|Sakshi

లండన్‌: ప్రపంచకప్‌ సన్నాహకాన్ని టీమిండియా ఓటమితో ఆరంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో కోహ్లి సేన ఘోర ఓటమి చవిచూసింది. టీమిండియా నిర్దేశించిన 180 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యఛేదనలో కివీస్‌ సారథి విలియమ్సన్‌(67), వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌(71)లు రాణించడంతో ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, హార్దిక్‌, చహల్‌, జడేజాలు తలో వికెట్‌ పడగొట్టారు.

తొలుత రెండు వికెట్లు పడగొట్టినా..
వన్డే ఫార్మట్‌లో గెలవాలంటే బలమైన భాగస్వామ్యాలు నమోదు కావాలి. ఈ విషయంలో కివీస్‌ విజయం సాధించింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ విలియమ్సన్‌, టేలర్‌లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 114 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరువురు అర్థశతకాలు సాధించారు. అయితే చహల్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి విలియమ్సన్‌ రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక విజయానికి 1 పరుగు అవసరం ఉండగా.. రాస్ టేలర్(71) కూడా ఔట్ అయ్యాడు. చివరిగా.. హెర్నీ నికోలస్ కావాల్సిన ఒక్క పరుగు చేసి కివీస్‌కు విజయాన్నందించాడు.

బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలం..
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు కివీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. కివీస్‌ బౌలర్ల ధాటికి 179 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ నిప్పులు చెరగడంతో రోహిత్‌(2), ధావన్‌(2), రాహుల్‌(6)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి(18), ధోని(17), కార్తీక్‌(4)లు వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో టీమిండియా కనీసం వంద పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. అయితే ఆల్‌రౌండర్లు హార్దిక్‌(30), జడేజా(54)లు రాణించడంతో టీమిండియా కనీసం గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. వీరిద్దరు రాణించడంతో పాటు చివర్లో కుల్దీప్‌(19) ఆకట్టుకున్నాడు. కివీస్‌ బౌలర్లు బౌల్ట్‌ నాలుగు, నీషమ్‌ మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు.  

మరిన్ని వార్తలు