ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌.. సీనియర్లపై వేటు

16 Sep, 2019 22:54 IST|Sakshi

కరాచీ: ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శనతో సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లో పాక్‌ సారథి, సీనియర్‌ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై అన్ని వైపులా విమర్శలు వచ్చాయి. దీంతో సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిపై వేటు వేయాలని ఫ్యాన్స్‌తో పాటు పాక్‌ మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పాక్‌ క్రికెట్‌ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని వారు పాక్‌ క్రికెట్‌ బోర్డుకు సూచించారు. దీనిలో భాగంగా కోచ్‌పై వేటు వేసి మిస్బావుల్ హక్‌ను ప్రధాన కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా నియమించింది. చీఫ్‌ సెలక్టర్‌గా నియమించాకపడ్డాక మిస్బావుల్ తన మార్క్‌ను చూపించాడు. 

శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పీసీబీ ఓ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌ కోసం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో సీనియర్‌ ఆటగాళ్లు మహ్మద్‌ హఫీజ్‌, షోయాబ్‌ మాలిక్‌లను ఎంపిక చేయలేదు. అయితే సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సారథిగా కొనసాగించారు. బాబర్‌ అజమ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌ అనంతరం మాలిక్‌ వన్డేలకు గుడ్‌ బై చెప్పినప్పటికీ టీ20ల్లో కొనసాగుతున్నాడు. అయితే శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు మాలిక్‌ను ఎంపిక చేయకపోవడంతో అతడి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలంకతో 27 నుంచి స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు