వరల్డ్‌కప్‌కు ఇంకా సమయం ఉంది: రోహిత్‌

6 Apr, 2020 10:29 IST|Sakshi
రోహిత్‌ శర్మ(ఫైల్‌ఫొటో)

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యావత్‌ భారత దేశం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ మహమ్మారిని జయించేందుకు ప్రతీ ఒక్కరూ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటూ తమ లాక్‌డౌన్‌ సమయాన్ని బంధువులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా లాక్‌డౌన్‌కే పరిమితమైనప్పటికీ సోషల్‌ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. (విరామం మంచిదేనా!)

దీనిలో భాగంగా ఆదివారం(ఏప్రిల్‌5) టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఒక ట్వీట్‌ చేశాడు. ‘ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా దీప ప్రజ్వలనకు మద్దతుగా నిలబడాలి. ఇదొక టెస్టు మ్యాచ్‌. ఈ టెస్టు మ్యాచ్‌ను గెలవడంపై మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీ సంఘీ భావాన్ని ఘనంగా చాటండి’ అని  పేర్కొన్నాడు. ఆపై మరొక ట్వీట్‌లో ఎవరూ బయటకు వెళ్లి సంబరాలు చేసుకోవద్దన్నాడు. ‘ మీరు భారత్‌లోని ఇళ్లల్లోనే ఉండండి. ఎవరూ కూడా బయటకు వెళ్లి సంబరాలు చేసుకోవద్దు. వరల్డ్‌కప్‌కు ఇంకా సమయం ఉంది’ అని పేర్కొన్నాడు.

ఇక రోహిత్‌తో పాటు హార్దిక్‌ పాండ్యా, సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌లతో సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లకు కూడా కొవ్వొత్తులను వెలిగించి సంఘీ భావం తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం శానిటేషన్స్‌ చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రతీ చోటా పారిశుధ్యంలో భాగమవుతున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇదిలా ఉంచితే, ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. అటు ఐసీసీతో పాటు క్రికెటర్లు కూడా అప్పటికి పరిస్థితులు చక్కబడి ఈ టోర్నీ జరుగుతుందనే ఆశాభావంలో ఉ‍న్నారు.

మరిన్ని వార్తలు