సెమీస్‌కు చేరడానికి ఏ జట్లకు ఛాన్స్?

25 Mar, 2016 16:51 IST|Sakshi
సెమీస్‌కు చేరడానికి ఏ జట్లకు ఛాన్స్?

టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ చాలా మ్యాచ్‌ల ఫలితాలు ఊహించినట్లే వచ్చినా... గ్రూప్-1లో వెస్టిండీస్, గ్రూప్-2లో న్యూజిలాండ్ దూసుకుపోతున్నాయి. ఇక లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో సెమీస్‌కు చేరడానికి ఏ జట్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం.    - సాక్షి, క్రీడా విభాగం
 
వెస్టిండీస్: ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్‌లతో ఆడాలి. ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్‌కు చేరతారు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఇది కష్టం కాదు. దక్షిణాఫ్రికా: ఇంగ్లండ్ చేతిలో ఓడి, అఫ్ఘాన్‌పై గెలిచింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, వెస్టిండీస్‌లతో ఆడాలి. రెండూ గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఒక్కటి ఓడినా అటు ఇంగ్లండ్ కూడా శ్రీలంక చేతిలో ఓడాలని కోరుకోవాలి. నెట్న్‌ర్రేట్ ఇంగ్లండ్ కంటే మెరుగ్గా ఉండటం సానుకూలాంశం.

ఇంగ్లండ్: మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది. తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం అటు దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లూ ఓడాలని కోరుకోవాలి.

శ్రీలంక: రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో ఆడాలి. ఈ రెండూ గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఇది చాలా కష్టమే అనుకోవాలి.

అఫ్ఘానిస్తాన్: ఆడిన మూడూ ఓడింది. చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడాలి. ఈసారికి సంచలనాలు లేకుండానే ఇంటి ముఖం పట్టొచ్చు.


 
నోట్: ఆ-ఆడినవి, గె-గెలిచినవి, ఓ-ఓడినవి, పా-పాయింట్లు, నె.ర.రే-నెట్ రన్‌రేట్
 
న్యూజిలాండ్: ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ప్రస్తుత ఫామ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకోవడం లాంఛనమే. ఒకవేళ బంగ్లా చేతిలో ఓడినా దాదాపుగా కివీస్ జట్టే అగ్రస్థానంలో నిలుస్తుంది.

భారత్: మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది. ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడి నాలుగు పాయింట్లతో మిగిలిన రెండు జట్లతో సమంగా నిలిస్తే మాత్రం ముందుకు వెళ్లడం కష్టం. ఎందుకంటే నెట్న్‌ర్రేట్ దారుణంగా ఉంది.

ఆస్ట్రేలియా: పాకిస్తాన్, భారత్‌లతో మ్యాచ్‌లు మిగిలాయి. రెండూ గెలిస్తే దర్జాగా సెమీస్‌కు వెళ్లొచ్చు. ఒకవేళ పాకిస్తాన్ చేతిలో ఓడితే భారత్‌పై గెలవాలి. అప్పుడు నెట్న్‌ర్రేట్ కూడా మెరుగుపడాలి.

పాకిస్తాన్: మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడింది. దాదాపుగా సెమీస్‌కు చేరడం కష్టం. ఒకవేళ ఆస్ట్రేలియాపై గెలిస్తే... అటు భారత్‌పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకోవాలి. ఈ సమీకరణంలో నెట్న్‌ర్రేట్ మెరుగ్గా ఉన్నందున పాక్‌కు అవకాశం ఉంటుంది.

బంగ్లాదేశ్: మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. చివరి మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌తో ఆడాలి.

మరిన్ని వార్తలు