-

అలా అయితే కష్టమయ్యేది: హర్మన్‌ప్రీత్‌

5 Mar, 2020 12:28 IST|Sakshi

సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్‌-ఎలో టాపర్‌గా ఉన్న భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. భారీ వర్షం పడటంతో టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో టాపర్‌గా ఉన్న భారత్‌ తుది పోరుకు అర్హత సాధించింది. దాంతో ఇక్కడ ఫైనల్‌కు చేరాలన్న ఇంగ్లండ్‌ ఆశలు నెరవేరలేదు. ఇక తమ టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత మహిళలు తొలిసారి ఫైనల్‌కు చేరారు. ఇప్పటివరకూ మూడుసార్లు సెమీస్‌కు చేరిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఆరంభం నుంచి ఇరగదీస్తూ ఫైనల్‌ ఆశలను నెరవేర్చుకుంది. (వరల్డ్‌ టీ20: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి)

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ రద్దయిన తర్వాత భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ‘ వాతావరణం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడం నిజంగా దురదృష్టకరం. దాంతో రూల్స్‌ ప్రకారం మేము ఫైనల్‌కు చేరాం. భవిష్యత్తులో మెగా టోర్నీల నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే అనేది కచ్చితంగా ఉండాలి. ఈ టోర్నీ ఆరంభమైన తొలి రోజు నుంచి మేము ఒకే ఆలోచనతో ఉన్నాం. గ్రూప్‌లో మొత్తం మ్యాచ్‌లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ సెమీ ఫైనల్‌కు ఏమైన ఆటంకాలు వస్తే అప్పుడు గ్రూప్‌లో మ్యాచ్‌లను పరిగణిలోకి తీసుకుంటారని తెలుసు. మేము గ్రూప్‌-ఎలో టాపర్‌గా నిలవకుండా ఉండి, అదే సమయంలో సెమీ ఫైనల్‌ రద్దయితే అప్పుడు ఫైనల్‌కు చేరడం కష్టమయ్యేది.

మా జట్టు గ్రూప్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలవడానికి సమష్టి ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరూ మంచి టచ్‌లో ఉన్నారు. షఫాలీ, స్మృతీ మంధానాలు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ అనేది కీలకం. ఒకసారి ఒత్తిడిలో పడ్డామంటే తిరిగి తేరుకోవడం​ కష్టం​.  మేము నెట్స్‌లో కూడా సానుకూల ధోరణితోనే ప్రాక్టీస్‌ చేస్తున్నాం. నేను, మంధానాలు ఇంకా గాడిలో పడాల్సి ఉంది. ఇది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ మహిళలకు తొలి ఫైనల్‌. మా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటాం. వరల్డ్‌కప్‌ను గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తాం’ అని అన్నారు. 


 

మరిన్ని వార్తలు