అజర్‌బైజాన్‌తో భారత్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

13 Mar, 2019 00:53 IST|Sakshi

అస్తానా (కజకిస్తాన్‌): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ ఓపెన్‌ విభాగంలో భారత పురుషుల జట్టు నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. అజర్‌బైజాన్‌ జట్టుతో మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌ మ్యాచ్‌ను భారత జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆధిబన్‌–అర్కాదిజ్‌; కృష్ణన్‌ శశికిరణ్‌–గాదిర్‌ గుసెనోవ్‌; సూర్యశేఖర గంగూలీ–ఎల్తాజ్‌ సఫారీలి; సేతురామన్‌–అబాసోవ్‌ నిజాత్‌ల మధ్య జరిగిన నాలుగు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఏడో రౌండ్‌ తర్వాత భారత్‌ పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

12 పాయింట్లతో రష్యా అగ్రస్థానంలో... 11 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. మహిళల విభాగంలో భారత జట్టు మూడో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–0తో నెగ్గింది. అబ్రామ్యాన్‌ తతేవ్‌పై ఇషా కరవాడే; కాటరీనాపై సౌమ్య స్వామినాథన్‌; యిప్‌ కారిస్సాపై పద్మిని రౌత్‌; సబీనాపై భక్తి కులకర్ణి గెలిచారు. ఏడో రౌండ్‌ తర్వాత భారత్‌ ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.    

మరిన్ని వార్తలు