ఆటగాళ్ల కోసం కొట్టుకున్న అభిమానులు

29 Dec, 2017 19:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో స్థానం కోసం జరిపిన రెజ్లింగ్‌ పోటీలు రసాభాసగా సాగాయి. భారత్‌ తరపున సుశీల్‌ కుమార్, ప్రవీణ్‌ రాణాలు ఈ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు సన్నాహక మ్యాచ్‌ జరిగింది. ఇందుకోసం ఇరువురి అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియానికి తరలివచ్చారు.

ఈపోటీలో గెలిచిన వారికే కామన్‌ వెల్త్ గేమ్స్ లో ఆడే అవకాశం లభిస్తుంది. ఓడిన వారు వెనుదిరగాలి. దీంతో ఇరువర్గాల అభిమానులు గొడవకు దిగారు. అక్కడున్న కుర్చీలు, బల్లలు విరగొట్టారు. దీంతో స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంతేకాకుండా సుశీల్‌ అభిమానులు ప్రవీణ్ రాణా సోదరుడుపై దాడికి దిగడంతో స్వల్ప గాయాలయ్యాయి.

వివాదంపై సుశీల్ కుమార్‌ స్పందించాడు. జరిగిన సంఘటనను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. అయితే గతంలో ప్రవీణ్‌ రాణా కూడా తన అభిమానుల్లాగే బౌట్‌లో ప్రవర్తించాడని విమర్శించాడు. నియమాలను వదిలేసి, కావాలనే కక్షపూరితంగా తనపై దాడిచేశాడని ఆరోపించాడు. అయినా తాను దీనిగురించి ఏమాత్రం బాధపడలేదని, ఆటలో ఇవన్నీ సర్వసాధారణం అన్నాడు. ఇప్పుడు ఈసమస్యకు కూడా పరస్పర అంగీకారంతోనే ఫుల్‌స్టాప్ పెడతామని సుశీల్ తెలిపాడు. గత కొద్ది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌ల్లో సుశీల్‌ కుమార్‌, ప్రవీణ్ రాణాను ఓడించాడు.

అభిమానుల డిష్యుం డిష్యుం

మరిన్ని వార్తలు