‘ప్లే ఆఫ్స్‌’కు యూపీ యోధ

28 Dec, 2018 02:48 IST|Sakshi

ప్రొ కబడ్డీ లీగ్‌
కోల్‌కతా:
‘ప్లే ఆఫ్స్‌’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో యూపీ యోధ 41–25తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచి 57 పాయింట్లతో జోన్‌ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్‌’కు చేరింది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ (55 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్‌లో పటిష్టమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న యూపీ యోధ అలవోకగా గెలిచింది.

యూపీ తరఫున రిషాంక్‌ 9, శ్రీకాంత్, నితేశ్‌ చెరో 6 పాయింట్లతో చెలరేగగా... బెంగాల్‌ తరఫున ఆదర్శ్‌ 4, జాంగ్‌ కున్‌ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 40–32తో జైపూర్‌పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది. జోన్‌ ‘ఎ’ నుంచి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ (93 పాయింట్లు), యు ముంబా (86 పాయింట్లు), దబంగ్‌ ఢిల్లీ (68 పాయింట్లు) ‘ప్లే ఆఫ్స్‌’కు చేరగా... జోన్‌ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్‌ (78 పాయింట్లు), బెంగాల్‌ వారియరర్స్‌ (69 పాయింట్లు), యూపీ యోధా (57 పాయింట్లు) నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్‌–1లో యు ముంబాతో యూపీ యోధ... ఎలిమినేటర్‌–2లో దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్‌ తలపడనున్నాయి.    

మరిన్ని వార్తలు