‘ఇదేం పద్ధతి.. నాకైతే అర్థం కావట్లేదు’

16 Apr, 2020 12:59 IST|Sakshi

ఇస్లామాబాద్‌: కోచింగ్‌లో కనీసం క్లబ్‌ లెవల్లో కూడా అనుభవం లేని మిస్బావుల్‌ హక్‌ను పాకిస్తాన్‌ ప్రధాన కోచ్‌గా కొనసాగించడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చర్యలను తప్పుపడుతూ ఎగతాళిగా మాట్లాడాడు. ఆటలో నైపుణ్యం, కెప్టెన్సీలో నిజాయితీ, కోచ్‌గా అనుభవం లేనటువంటి మిస్బావుల్‌ను పాక్‌ హెడ్‌ కోచ్‌గా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రామాణికంగా అతడిని కోచ్‌గా కొనసాగిస్తున్నారో చెప్పాలని పీసీబీని యూసఫ్‌ ప్రశ్నించారు. 

‘కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస అనుభవం ఉండాలనే షరతును పీసీబీ పెట్టింది. కానీ కనీసం క్లబ్‌ లెవల్లో కూడా కోచింగ్‌ అనుభవం లేని మిస్బావుల్‌ను ఎంపిక చేసింది. కోచ్‌ ఎంపిక విషయంలో పీసీబీ అవలంభించిన ద్వంద్వ వైఖరేంటో అర్థం కావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆటగాళ్లు, సారథి నిజాయితీగా, నిస్వార్థంగా ఉండాలని మిస్బా పేర్కొన్నాడు. కానీ అతడు సారథిగా ఉన్నప్పుడు అజహర్‌ అలీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పగలడా?

అజహర్‌ అలీ మంచి బ్యాట్స్‌మన్‌. అయితే అతడు క్రీజులో సెటిల్‌ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. మిస్బా కూడా అంతే. అతడి ఆటలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేదు. ఒకే రీతిలో రక్షణాత్మకంగా ఆడతాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగేవరకు వేచి చూసి ఆ తర్వాత పరుగులు రాబట్టేవాడు’అని యూసఫ్‌ వ్యాఖ్యానించాడు. మిస్బావుల్‌ పాక్‌ తరుపున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా మంచి రికార్డు ఉండటంతో పాటు వివాదరహితుడుగా పేరుగాంచిన మిస్బాను పాక్‌ జట్టు ప్రధానకోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా పీసీబీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.   

చదవండి:
ఐసోలేషన్‌ క్రికెట్‌ కప్‌.. ఐసీసీ ట్వీట్‌
ఇలాంటి దిగ్గజం.. తరానికి ఒక్కరు

మరిన్ని వార్తలు