కిదాంబి శ్రీకాంత్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు

12 Apr, 2018 18:53 IST|Sakshi

సాక్షి, గుంటూరు: పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ ర్యాంకును సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్‌ బ్యాడ్మింటన్‌ చరిత్రలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను ప్రకాశ్‌ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్‌ సాధించినందుకు గర్వకారణంగా ఉందని ఒక ప్రకటనలో ప్రశంసించారు. శ్రీకాంత్‌ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని మెచ్చుకున్నారు.

డెన్మార్క్‌ ఆటగాడు విక్టర్‌ అలెక్సన్‌ వెనక్కి నెట్టి శ్రీకాంత్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించడం గొప్ప విషయంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభివర్ణించారు.  ఇలాంటి మరెన్నో విజయాలు, పతకాలను సాధిస్తూ మరింత ఉన్నత శిఖరాలను శ్రీకాంత్‌ అధిరోహించాలని ఆకాంక్షించారు. అలానే నంబర్‌ వన్‌ ర్యాంకును ఎప్పటికీ సుస్థిరంగా ఉంచుకోవాలన్నారు.

ప్రపంచ బ్యా‍డ్మింటన్‌ సమాఖ్య గురువారం అధికారికంగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 76,895 పాయింట్లతో శ్రీకాంత్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు