న్యూఢిల్లీ: రాబోయే వన్డే వరల్డ్కప్లో భారత జట్టుకు ఎంఎస్ ధోని చాలా కీలకమని సీనియర్ క్రికెటర్ యువరాజ్సింగ్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతని అనుభవం జట్టులో యువ క్రికెటర్లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లికి బాగా ఉపయోగపడుతుందని యువీ చెప్పుకొచ్చాడు. ఆటపై అతనికున్న నిశిత అవగాహన జట్టుకు ఎంతో లాభం చేకూరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.శుక్రవారం ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన యువీ పలు అంశాలపై మాట్లాడాడు.
‘అద్భుతమైన క్రికెట్ మేధస్సు ఎంఎస్ ధోని సొంతం. వికెట్కీపర్గా ఆటను నిశితంగా పరిశీలించేందుకు మంచి అవకాశముంటుంది. గత కొన్నేళ్లుగా కీపర్గా, బ్యాట్స్మన్గా అతను మెరుగ్గా రాణిస్తున్నాడు. నాయకునిగా ధోని ఎప్పుడో నిరూపించుకున్నాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అతని సలహాలు, సూచనలు యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్ కోహ్లికి బాగా ఉపకరిస్తాయి. ఇటీవల ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో మెరిసిన ధోని తన బ్యాటింగ్ సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు’ అని యువీ తెలిపాడు.