లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్లోని ఫ్లాట్ ట్రాక్స్ చూసి తానేమీ ఆందోళన చెందడం లేదని భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ స్పష్టం చేశాడు. గత కొంతకాలంగా తాము ఫ్లాట్ పిచ్లపై తరచు మ్యాచ్లు ఆడటంతో అది పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదన్నాడు. ఆ విషయంలో తమకు చింతలేదని, దాని గురించి అభిమానులు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని చహల్ పేర్కొన్నాడు. భారత్లో చిన్నస్వామి స్టేడియం అత్యుత్తమ బ్యాటింగ్ ట్రాక్ అని, అక్కడ తాను చాలా మ్యాచ్లు ఆడి ఉండటంతో ఫ్లాట్ ట్రాక్స్ అంశం పెద్దగా ఆందోళనకు గురి చేయడం లేదని తెలిపాడు. ఒకవేళ ఇంగ్లండ్లో ఎదురయ్యే ఫ్లాట్ ట్రాక్స్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కచ్చితంగా తాను ఒత్తిడిలో ఉన్నట్లేనన్నాడు.
‘గత ఆరు నెలలుగా కుల్దీప్తో పాటు నాలో మార్పేమీ లేదు. జట్టు అవసరాలని బట్టి బంతులు వేస్తాం. ఇంగ్లండ్లో ఫ్లాట్ పిచ్లను చూసి భయపడడం లేదు. అలాంటి వికెట్లకు అలవాటు పడ్డాం. బ్యాటింగ్కు స్వర్గధామమైన చిన్నస్వామి మైదానంలో ఏటా నేను ఎక్కువ మ్యాచ్లు ఆడుతూనే ఉన్నా. ఫ్లాట్ పిచ్లపై నేను ఒత్తిడికి పడితే ప్రత్యర్థి బౌలర్ సైతం ఒత్తిడికి గురవుతాడు కదా. రసెల్, వార్నర్ లాంటి ఆటగాళ్లు పరుగులు చేయకుండా అడ్డుకోలేం. వారిపై దాడి చేయాలి. అందుకే ప్రతి బంతిని అత్యుత్తమంగా వేసేందుకే ప్రయత్నిస్తాను. అతి పెద్దదైన ప్రపంచకప్కు వచ్చేందుకు ముందు జరిగే భారీ టోర్నీలో రాణించడం ముఖ్యం. ఐపీఎల్ విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తుంది’ అని చహల్ అన్నాడు.