ముంబై: టీమిండియా సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు నేడు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు జహీర్ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి జహీర్ రిటైర్ అవుతున్నాడని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ముందుగా ట్వీట్ చేశారు. 'జహీర్ ఖాన్ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ శుక్లా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2002 నుంచి జహీర్ ఖాన్ తన ఫేవరేట్ బౌలర్ అని పేర్కొన్నారు. ఐపీఎల్ లో అతడు ఆడతాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నిలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు. గత మూడునాలుగేళ్లుగా గాయాల కారణంగా భారత జట్టులోకి వస్తూపోతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.