రూ.కోటి విలువ చేసే నగల చోరీ

9 Jan, 2014 01:29 IST|Sakshi

 టీ.నగర్, న్యూస్‌లైన్:నగల దుకాణం గోడకు కన్నం వేసి రూ.కోటి విలువచేసే నగలు చోరీ చేశారు. ఈ సంఘటన  పెరంబూరు పేపర్‌మిల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. చెన్నై పెరంబూరు పేపర్ మిల్స్ రోడ్డుకు చెందిన సంతోష్ (49). రాజస్థాన్‌కు చెందిన ఈయన అదే రోడ్డులో సంతోష్ జ్యువెలరీ నగల దుకాణం నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణానికి తాళం వేసి సంతోష్,  సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. మంగళవారం దుకాణానికి సెలవు. దీంతో సంతోష్ బయట ఊరికి వెళ్లారు. బుధవారం ఉదయం దుకాణం తెరిచేందుకు సంతోష్ తమ్ముడు రాజేష్ వెళ్లాడు. దుకాణ ం తెరచి లోనికి వెళ్లి చూడగా షోరూంలోని నగలన్నీ చోరీకి గురైనట్లు గుర్తించి దిగ్భ్రాంతి చెందాడు. దుకాణం వెనుకవున్న గోడకు కన్నం వేసిన దుండగులు లోనికి ప్రవేశించి నగలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 400 సవర్లకు పైగా నగలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.కోటి ఉంటుందని బాధితుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. పోలీసు జాగిలాలను రప్పించారు. వేలిముద్రల నిపుణులు దుకాణంలో లభ్యమైన ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు