వైద్య విద్య మరింత భారం!

25 Jun, 2017 09:37 IST|Sakshi
వైద్య విద్య మరింత భారం!

► 30 శాతం ఫీజుల్ని పెంచాలి
►  ప్రైవేటు కాలేజీల పైరవీలు
►  త్వరలో సర్కారుతో భేటీ
► జాతీయ కోటాలోకి 414 సీట్లు


సాక్షి, బెంగళూరు: పేదలు, మధ్యతరగతికి వైద్య విద్య మరింత భారం కానుంది. ఇందుకు సంబంధించిన తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య, దంత వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇక సీట్‌మాట్రిక్స్‌ (సీట్ల లభ్యత), ఫీజుల మొత్తాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు కోసం రాష్ట్రంలోని వైద్య సంస్థల యాజమాన్యం వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ప్రస్తుతం 58 మెడికల్‌ కళాశాలలు ఉండగా ప్రభుత్వ కళాశాలల్లో 2,550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్‌ఐ కళాశాలల్లో 200, నాన్‌–మైనారిటీ కళాశాలల్లో 2,015 సీట్లు, మైనారిటీ కళాశాలలో 2,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక డీమ్డ్‌ యూనివర్శిటీల్లో 1,630 సీట్లు ఉన్నాయి. మొత్తం సంఖ్య 8,395. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువ వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈసారి జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించినందువల్ల కర్ణాటకలోని మొత్తం సీట్లలో ఆల్‌ ఇండియా కోటా కింద 414 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 843 సీట్లు వెళ్తాయి. మిగిలిన సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు.

గతేడాది ఫీజులు ఇవీ
ఫీజుల విషయానికి వస్తే గత ఏడాది కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ నిర్వహించిన సీఈటీ ద్వారా ప్రభుత్వ కళాశాలలో సీటు పొందిన వారు ఏడాదికి రూ.16,700 ఫీజు చెల్లించేవారు. ప్రైవేటు కళాశాలలో గవర్నమెంట్‌ కోటా కింద సీటు పొందినవారు ఏడాదికి రూ.77,500 ఫీజుగా చెల్లించారు. కామెడ్‌–కే నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రైవేటు కళాశాలల్లో సీటు పొందిన వారు ఏడాదికి రూ.5.75 లక్షలు చెల్లించారు.

30 శాతం పెంచాలని లాబీయింగ్‌
నిర్వహణ ఖర్చులు పెరిగినందున ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు దాదాపు 30 శాతం ఫీజులు పెంచాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ విషయమై కర్ణాటక రిలీజియస్‌ అండ్‌ లింగ్విస్టిక్‌ మైనారిటీ ఫ్రొఫెషనల్‌ కాలేజస్‌ అసోసియేషన్‌ సభ్యుడొకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌ను సంప్రదించగా ‘ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఫీజు పెంచాలని కోరుతున్న మాట వాస్తవం. ఈ విషయమై వారంలోపు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాం.’ అని తెలిపారు.

నీట్‌లో సీఈటీ ర్యాంకర్ల డీలా
సీఈటీలో ఉత్తమ ర్యాంకులు పొందిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే నీట్‌లో కూడా తమ ప్రతిభను చూపించారు. అందులో ఒక్కరు మాత్రమే (సంకీర్త్‌ సదానంద...సీఈటీలో–2, నీట్‌లో–4)పదిలోపు ర్యాంకును పొందారు. ఇక 500లోపు ర్యాంకులు పొందిన వారు ఇతనితో కలిపి ముగ్గురు మాత్రమే. వారిలో రక్షితా రమేష్‌ (సీఈటీలో–1, నీట్‌లో–41). మోహిత్‌ నారాయణ్‌ (సీఈటీలో–5, నీట్‌లో–271) ఉన్నారు. సీఈటీలో మూడో ర్యాంకు పొందిన అనన్యకు నీట్‌లో 1,504 ర్యాంకు వచ్చింది. దీంతో మన వద్ద సెకెండరీ స్థాయి విద్యా వ్యవస్థ నాణ్యత మరింత పెరగాల్సి ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు