తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి

13 Jun, 2020 10:05 IST|Sakshi

సాక్షి, చెన్నై‌ : తినే వస్తువు అనుకుని నాటుబాంబు కొరికి చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. తిరుచి జిల్లా తొట్టియమ్‌ సమీపంలోని అలగరై గ్రామానికి చెందిన గంగాధరన్‌ (31), తమిళ్‌ ఆరసన్‌ (28), మోహన్‌ రాజ్‌ (16) గురువారం పాపం పట్టి ప్రాంతంలో ఉన్న సెల్వకుమార్‌ (44) వద్ద మూడు నాటు బాంబులను కొనుగోలు చేశారు. వాటిని మణమేడు ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో చేపలు పట్టేందుకు ఉపయోగించారు. పట్టిన చేపలను అలాగరైల్లో ఉన్న సహోదరుడు భూ పతి ఇంటికి తీసుకుని వెళ్లారు. మిగిలిన ఓ నాటుబాంబుని అక్కడున్న మంచంపైన పెట్టి, ఇంటి వెనుక భాగంలో ఉన్న స్థలంలో చేపలను శుభ్రం చేయడానికి వెళ్లారు.

అక్కడికి వచ్చిన భూపతి కుమారుడు విష్ణుదేవ్‌ (6) మంచంపై ఉన్న నాటుబాంబుని తినే పదార్థం అనుకొని కొరికినట్టు తెలిసింది. ఆ నాటుబాంబు పేలడంతో విష్ణుదేవ్‌ తల చెల్లాచెదురైంది. బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం తెలపకుండా మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం పోలీసులు కేసు నమోదుచేసి గంగాధరన్, మోహన్‌జ్, సెల్వకుమార్‌ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. చదవండి: కరోనా కల్లోలంలో హైదరాబాద్‌ బిర్యానీ! 

మరిన్ని వార్తలు