రెండు నెలల్లో మార్పు తెస్తాం

25 Dec, 2013 23:02 IST|Sakshi
న్యూఢిల్లీ: రెండేరెండు నెలల కాలంలో పూర్తిగా పాలనా వ్యవస్థనే మరమ్మతు చేస్తామని ఆప్ పార్టీ నేత సోమనాథ్‌భారతి ప్రకటించారు. ఆప్ పార్టీ ఏర్పాటు చేయనున్న  ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఈయన ఒకరు. విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గిస్తాం. ఇది ఆప్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనదని ప్రకటించారు. ‘‘మొత్తం పాలన వ్యవస్థనే మరమ్మతు చేయాల్సి ఉంది. పాలనాధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ప్రజలు ఈ మార్పును స్పష్టంగా చూస్తారు’’ అని ఒకనాటి న్యాయవాది నేటి శాసనసభ్యుడు వక్కానించారు.
 
 మాలవ్యానగర్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన సోమనాథ్ భారతి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం మా పార్టీ నాయకుల ఎజెండాలో ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుంది. నగరంలో ఉన్న మూడు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యకలాపాలను మదింపు చేయాలని కాగ్‌కు సిఫార్సు చేయనున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘నగరంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి రోజూ 700 లీటర్ల ఉచిత మంచినీరు పంపిణీ చేస్తాం. ఇది మేము ప్రజలకిచ్చిన మరో ముఖ్యమైన హామీ. నగరానికి రోజుకు 1,100 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. అధికారికంగా 50 మిలియన్ గ్యాలన్ల లోటు ఉంది. 
 
 2011 జనభాగణన ప్రకారం నగరంలో 17 నుంచి 18 మిలియన్ల మంది ప్రజలకు శుద్ధి చేసిన నీరు లభించడం లేదు. మరిన్ని జలవనరులను సృష్టిస్తాము. దీని ద్వారా నీటి కొరత తీరుస్తాం’’ అన్నారు. మేము చేసిన 18 వాగ్ధానాల అమలులో సాధకబాధకాలను అధ్యయనం చేస్తున్నాము. వీటిని వీలయినంత త్వరలో అమలు చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ హయంలో చోటు చేసుకున్న లొసుగులు, లోటుపాట్లను పరిశీలిస్తున్నాం. తొలి రెండువారాలు కాంగ్రెస్ పని విధానం ఎలా సాగిందో అర్థం చేసుకోవాడానికి కేటాయిస్తాం. వ్యవస్థలో కలుపు మొక్కల్లా వెళ్లూనుకున్న అవినీతిని ఏరి పారేయాల్సి ఉంది. నియమబద్ధంగా పనిచేసే నీతిమంతులైన అధికారులను ప్రొత్సహిస్తాం’’ అని వివరించిన భారతి ఈ సందర్బంగా హర్యానాకు చెందిన అశోక్ కెమ్కా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాశక్తి నాగ్‌పాల్‌లను గుర్తుచేశారు. 
 
 ‘‘ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పథకాల రూపశిల్పులు. వాటిని మేము అమలు చేస్తాం, సంరక్షిస్తాం. ప్రతి అధికారిని కనిపెట్టి ఉంటాం. అవినీతికి పాల్పడేవారు ఏస్థాయిలో ఉన్నా వారిని తొలిగించి ప్రక్షాళన చేస్తాం.అవినీతి పరులైన మంత్రుల ఒత్తిడికి నీతినిజాయితీతో పనిచేసే అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేస్తాం’’ అని స్పష్టం చేశారు బీహార్‌లో పుట్టి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకొని 1992 నుంచి ఢిల్లీలో నివాసం ఉంటున్న సోమనాథ్ భారతి. మేము అవినీతిపై పోరు ప్రకటించి ఎన్నికల్లో గెలిచాం. మా నిజాయితిని నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పుడు మేము అవినీతిని నిర్మూలించకపోతే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది’’ అని ముగించాడి ఐఐటీ సైన్స్ గ్రాడ్యుయేట్
 
మరిన్ని వార్తలు