మోదీ ఇలాకాపై కన్నేసిన ఆప్

18 Jun, 2016 13:07 IST|Sakshi
మోదీ ఇలాకాపై కన్నేసిన ఆప్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆప్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెలలో రెండురోజులపాటు గుజరాత్లో పర్యటించనున్నారు. కాగా జూలై 8న కేజ్రీవాల్ ముందుగా సౌరాష్ట్రలోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం అధికారికంగా ప్రచారాన్ని ఆరంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేజ్రీవాల్ తన పర్యటనలో భాగంగా ఆప్ రాష్ట్ర కన్వీనర్ కానూభాయితో కలిసి పార్టీ కార్యకర్తలతో పాటు నేతలతో విస్తృతంగా చర్చించనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ఇప్పటికే గుజరాత్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఢిల్లీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ నియమించింది. కాగా ఇప్పటికే ఎన్డీయే అధికారంలో ఉన్న గోవా, పంజాబ్ల్లో రానున్న ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరం చేసిన ఆప్ తాజాగా 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజరాత్లోనూ బీజేపీకి పోటీ ఇవ్వాలని యోచిస్తోంది. గతంలో పటేల్ ఉద్యమానికి ఆప్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు