నాయికలను చూస్తే జాలేస్తోంది

12 Mar, 2015 03:32 IST|Sakshi
నాయికలను చూస్తే జాలేస్తోంది

తమిళ చిత్ర పరిశ్రమలో కథా నాయికల పరిస్థితి చూస్తుంటే జాలి కలుగుతోందంటున్నారు సీనియర్ నటి లక్ష్మి. త్వరలో మూణేమూణువార్తైచిత్రంతో ప్రేక్షకులను బామ్మగా అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’ అనే పేరుతో తెలుగులోనూ తెరకెక్కడం విశేషం. క్యాపిటల్ ఫిలిం సర్క్యూట్ పతాకంపై గాయకుడు ఎస్‌పి చరణ్ నిర్మిస్తున్న ఈ  చిత్రానికి  మధుమిత దర్శకురాలు. ప్రఖ్యాత గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అర్జున్, అతిథి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి లక్ష్మి తెలుపుతూ ఈ తరం నటీనటుల ప్రతిభ ఆశ్చర్యపరుస్తోంది.
 
 తాను ఇంతకుముందు మిథునం అనే తెలుగు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి నటించాను. ఆ చిత్రంలో నటనకు సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత తమిళంలో బాలుతో నటిస్తున్న తొలి చిత్రం మూణేమూణు వార్తై ఈ చిత్రంలో అమ్మగా నటించమని దర్శకురాలు మధుమిత అడిగినప్పుడు మళ్లీ అలాంటి పాత్రలా అని ఆలోచనలో పడ్డాను. అప్పుడు దర్శకురాలు నా పరిస్థితి చూసి వెంటనే అమ్మపాత్రను బామ్మగా మార్చారు. బామ్మగా నటించడానికి నేనేమీ సంకోచించలేదు. ఎందుకంటే నిజ జీవితంలో నేను బామ్మనే కాబట్టి. ఇకపోతే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులెవ్వరూ తనకు పరిచయం లేదు.
 
 అయినా వాళ్లతో నటించడం సరికొత్త అనుభవం. పూర్తి హాస్యంతో కూడిన ప్రేమకథను దర్శకురాలు మధుమిత విభిన్న శైలిలో తెరకెక్కించారు. ఈ తరం మహిళా దర్శకులు సినిమా గురించి పూర్తిగా ఆకళింపు చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకురాలు మధుమిత తనకేమి కావాలో దాన్ని తెలివిగా రాబట్టుకోవడంలో దిట్ట. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఇంత త్వరగా తెరకెక్కించడం అంత సులభం కాదని దాన్ని మధుమిత సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. ఇక ఈతరం కథానాయికల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. నేటి తరం కథానాయికలను ఇంకా వ్యాపారంతో భాగంగా బొమ్మలుగానే చూస్తున్నారని లక్ష్మి వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు