మళయాల దర్శకులపై ఫిర్యాదు

19 Mar, 2015 00:26 IST|Sakshi
మళయాల దర్శకులపై ఫిర్యాదు

మళయాల దర్శకులపై నటి పూర్ణ ఫిర్యాదు చేసింది. ‘ద్రోహి’, ‘విద్దగన్’ చిత్రాల్లో నటించారు పూర్ణ. ఇటీవల ఆమె విలేకరుల తో మాట్లాడారు. తమిళంలో తనకు మెరుగైన పాత్రలు వస్తున్నాయని, అదే విధంగా తెలుగు చిత్రాల్లోనూ అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. తన సినీ ప్రయాణం సంతోషంగా సాగుతోందని, తమిళ, తెలుగు అభిమానులు తనను పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌తోనే గుర్తిస్తున్నట్లు తెలిపారు. అందుకు కారణం తాను గ్లామర్ రోల్స్‌లో నటించకపోవడమేనన్నారు. అభిమానుల మనసులో అటువంటి ముద్ర సంపాదించుకోవడం సంతోషంగా వుందన్నారు.
 
 మళయాలంలో అనేక మంది నటీమణులు ప్రతిభ కలిగివున్నారని, అయితే మళయాల దర్శకులు మాత్రం వేరే రాష్ట్రాలకు చెందిన తారలను మాత్రం తమ చిత్రాల్లో నటించేందుకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ‘రాజాధిరాజా’ మళయాల చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ చేశానని, వరుసగా అటువంటి ఆఫర్లు వస్తున్నాయన్నారు. పాటల్లో నటించే తారగా పేరు పొందడం ఇష్టం లేకపోవడంతో ఇటువంటి అవకాశాలను తిరస్కరించానన్నారు. మరోసారి ఆ విధంగా డ్యాన్స్ చేసేందుకు సమ్మతిస్తే ఆ ఏడాది పొడవునా అటువంటి ఆఫర్లే ఇస్తారని వాపోయారు పూర్ణ.  
 
 

మరిన్ని వార్తలు