నటి వింద్య ఆత్మహత్యాయత్నం

5 Mar, 2014 09:10 IST|Sakshi
నటి వింద్య ఆత్మహత్యాయత్నం

*అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగి కోమాలోకి...
*అసిస్టెంట్ డెరైక్టర్ మంజునాథ్ వేధింపులే?


బెంగళూరు : జీవితంపై విరక్తి చెందిన నటి వింద్య అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగి  ఆత్మహత్యాయత్నం చేసి ఇక్కడి బౌరింగ్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోందని మంగళవారం పోలీసులు తెలిపారు. వింద్య స్నేహితుడు మంజునాథ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఈ ఘటనకు ఒడిగొట్టిందని వింద్య తల్లిదండ్రులు రంగస్వామి, నాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనెదమరయల్లి అనే కన్నడ సినిమాలో వింద్య  హీరోయిన్‌గా చేసింది. అదే సినిమాకు అసిసెంట్ డెరైక్టర్‌గా మంజునాథ్ పనిచేశారు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని సమాచారం.

అయితే ఇటీవల మంజునాథ్ నడవడికను గమనించిన వింద్య అతనికి దూరంగా ఉంది. ఈ విషయం జీర్ణించుకోలేని మంజునాథ్ నిత్యం వింద్యకు ఫోన్ చేసి వేధించేవాడని సమాచారం. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో వింద్య మొబైల్‌కు కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వింద్య కొద్దిసేపటికే తన గదిలోకి వెళ్లి బోరున విలపించింది.  అనంతరంలో మధుమేహ వ్యాధికి సంబంధించిన మాత్రలు మింగి అస్వస్థతకు గురైంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వింద్య కోమాలో ఉందని, ఆమె కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. వింద్య దాదాపు 50కి పైగా మాత్రలు మింగి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారం క్రితం ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో మనెదమరయల్లి చిత్ర నిర్మాత మహేష్, దర్శకుడు రాజీవ్ వింద్య, మంజునాథ్‌లను పిలిపించి మందలించినట్లు సినీవర్గాల సమాచారం. తన కుమార్తె చేతులపై సిగరెట్‌తో కాల్చి, సృహ తప్పేటట్లు చేసిన మంజునాథ్ లైంగికదాడికి కూడా పాల్పడ్డాని వింద్య తండ్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు