-
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరుతోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరిగితే మరిన్ని అప్పులు తెచ్చి, కమీషన్లు నొక్కాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల ఆలోచన అని ఆరోపించారు. అందుకే అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంపర్లాడుతోందని విమర్శించారు.
కేంద్రంలో 20 శాతం రెవిన్యూ పెరిగితే జీడీపీ 7.2 శాతం ఉందని, ఏపీలో రెవిన్యూ పెరగకపోయనా 12.23 శాతం ఉన్నట్టు అబద్ధాలు చెబుతున్నారని అంబటి విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలన్న డిమాండ్ను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును చేర్చగా, తన వల్లే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని అంబటి రాంబాబు అన్నారు.