అంబికి సింగపూర్‌లో చికిత్స

2 Mar, 2014 06:44 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శ్వాస కోశం ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్‌ను శనివారం ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. సింగపూర్ ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన వెంట సతీమణి సుమలత, కుమారుడు అభిషేక్ గౌడ, నిర్మాత రాక్లైన్ వెంకటేశ్‌లు కూడా వెళ్లారు. అక్కడ చికిత్సకు ఆయన చక్కగా స్పందిస్తున్నారని సమాచారం. వారం రోజులుగా ఇక్కడి విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఉన్నత వైద్యం కోసం సింగపూర్‌కు తరలించాలని ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్యులు సూచించారు. ఉదయం పది గంటలకు అక్కడికి చేరుకున్న అంబరీశ్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్సలు ప్రారంభించారు.
 
పూర్తి స్వస్థతతో తిరిగి వస్తారు :  
 
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబరీశ్‌ను ఉత్తమ చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకు వెళుతున్నామని, ఆయన పూర్తి స్వస్థతతో తిరిగి వస్తారని ఆయన సతీమణి సుమలత అభిమానులకు భరోసా ఇచ్చారు. సింగపూర్‌కు వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడుతూ అసంఖ్యాక అభిమానుల ఆశీర్వాదం వల్ల ఆయనకు ఎటువంటి సమస్యలు ఎదురు కాబోవని అన్నారు. ఉత్తమ చికిత్సను అందించడం ద్వారా ఆయనను మళ్లీ రెబల్ స్టార్‌గా అభిమానుల ముందుకు తీసుకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. విక్రమ్ ఆస్పత్రి వైద్యులు ఆయనను బిడ్డ లాగా చూసుకున్నారని, శ్వాస సమస్య ఇంకా ఉన్నందున అనివార్యంగా సింగపూర్‌కు పిలుచుకు పోతున్నామని ఆమె చెప్పారు.
 

మరిన్ని వార్తలు