అనాథ శిశువు అయ్యింది అమెరికా అమ్మాయి

15 Jul, 2018 12:47 IST|Sakshi

శివాజీనగర(కర్ణాటక): ఏడాది కిందట చెత్తకుప్పలో అనాథ శిశువుగా దొరికిన అన్విత తొలి పుట్టినరోజు వేడుకలు శనివారం హాసన్‌లోని తవరు చారిటబుల్‌ ట్రస్ట్‌లో ఘనంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన దంపతులు ఈ శిశువును దత్తత తీసుకున్నారు.  ఒక ఆడశిశువును హొళె నరసిపురలో కుప్పతొట్టిలో పడేసి వెళ్లిపోవడంతో చీమలు, ఉడుతలు కరవడంతో పసిగుడ్డు రోదిస్తుండగా, స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. తరువాత హాసన్‌ జిల్లా ఆసుపత్రికి చేర్చగా వైద్యుల చికిత్సలో ప్రాణాలతో బయటపడింది.

త్వరలో అమెరికాకు
హాసన్‌లో డాక్టర్‌ పాలాక్షప్ప నేతృత్వంలోని తవరు చారిటబల్‌ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన అన్వితా శనివారం తొలి పుట్టిన రోజును జరుపుకుంది. కలెక్టర్‌ రోహిణి సింధూరి ప్రత్యేకంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈసందర్భంగా అమెరికాకు చెందిన రెండు జంటలు ఇందులో పాల్గొన్నాయి. అన్వితతో పాటు మరొక చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. దీంతో అనాథ శిశువు అమెరికా అమ్మాయి అయ్యిందని పలువురు ఆనందం వ్యక్తంచేశారు. వీసా తదితరాలు కొన్ని రోజుల్లో పూర్తిచేసుకుని అన్వితను అమెరికాకు తీసుకెళ్తామని అమెరికన్‌ దంపతులు తెలిపారు.  

మరిన్ని వార్తలు