రూపాయి అడ్వాన్స్‌గా ఇవ్వండి

19 Mar, 2015 00:25 IST|Sakshi
రూపాయి అడ్వాన్స్‌గా ఇవ్వండి

 నటి అనన్యకు తన చిత్రంలో నటించినందుకు దర్శకుడు బాల శ్రీరాం ఒక రూపాయి మాత్రం అడ్వాన్సుగా ఇచ్చారట. దర్శకుడు ఎ.వెంకటేష్ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు బాల శ్రీరాం. ‘ఇరవుం పగలుం వరుం’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. ఇందులో మహేష్, అనన్య జంటగా నటించారు. అనన్యతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమె వెంటబడిన సంఘటన గురించి దర్శకుడు మాట్లాడుతూ, అనన్యను ఈ చిత్రంలో ఒప్పందం చేసుకునేందుకు అనేక సార్లు ఆమెను కలిసి కథ చెప్పేందుకు ప్రయత్నించానన్నారు. చెన్నైలో కలవగా కేరళకు వచ్చి కథ చెప్పమని చెప్పి హఠాత్తుగా బయలుదేరి వెళ్లారన్నారు. ఆమె ఇల్లు వెతికి పట్టుకుని వెళ్లగా కథ వినేందుకు సమ్మతించారన్నారు.
 
 ఈ సందర్శంగా నటి అనన్య మాట్లాడుతూ ఇంతవరకు భారీ బ్యానర్, ఇదివరకే చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులతోపాటు పనిచేశానన్నారు. మీరు కొత్త దర్శకులు కావడంతో కథ వినేందుకు సంశయించానని తెలుపుతూ కథ వినిపించమన్నారు. ఈ కథ చెప్పడంతోనే నచ్చడంతో ఒక్క రూపాయి అడ్వాన్స్‌గా ఇవ్వండి, ఈ చిత్రాన్ని మీరు ఎప్పుడు తీసినా తాను ఖచ్చితంగా నటిస్తానన్నారు. ఆ విధంగా ఒక రూపాయి అడ్వాన్సు తీసుకున్నారని, తర్వాత పారితోషికాన్ని తగ్గించుకుని నటించారన్నారు. ఈ చిత్రం పూర్తికావచ్చిందని, ఒక వివాదం కారణంగా కోర్టులో చిత్రానికి స్టే విధించబడిందన్నారు. ప్రస్తుతం ఈ స్టే తొలగిపోయిందని, 20వ తేదీ చిత్రం విడుదల కానుందన్నారు. బాలసుబ్రమణియం పెరియసామి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్. తనిగైవేలు విడుదలచేయనున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు