జయ ఆస్పత్రిలో ఎందుకు చేరారో తెలియదు!

29 Jun, 2018 08:27 IST|Sakshi
విచారణకు హాజరైన డాక్టర్‌ నళిని, నర్సు ప్రేమ ఆంథోని

అపోలో ఆస్పత్రి నర్సు వాంగ్మూలం

న్యాయమూర్తి ఆర్ముగస్వామి దిగ్భ్రాంతి

టీ.నగర్‌: జయలలిత ఏ వ్యాధి కోసం ఆస్పత్రిలో చేరారో తెలియదని అపోలో ఆస్పత్రి నర్సు బుధవారం వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివరణతో విచారణ కమిషన్‌ న్యాయమూర్తి ఆర్ముగస్వామి దిగ్భ్రాంతి చెందారు. విచారణ కమిషన్‌ ఎదుట అపోలో పనిచేస్తున్న డాక్టర్‌ నళిని, నర్సు ప్రేమ ఆంథోని బుధవారం హాజరయ్యారు. జయకు అందించిన చికిత్స గురించి న్యాయమూర్తి ఆర్ముగస్వామి వారిని వివిధ ప్రశ్నలు అడిగారు. కమిషన్‌ న్యాయవాదులు ఎస్‌.పార్థసారథి, నిరంజన్‌ వారి వద్ద క్రాస్‌ ఎగ్జామిన్‌ జరిపారు.

న్యాయమూర్తి, కమిషన్‌ న్యాయవాదులు అడిగిన పలు ప్రశ్నలకు తెలియదు, జ్ఞాపకం లేదని వారు బదులిచ్చినట్టు సమాచారం. డాక్టర్‌ నళిని 2016 అక్టోబర్‌ ఐదో తేదీన అపోలో ఆస్పత్రిలో విధుల్లో చేరారు.  జయలలితకు చికిత్స అందించిన ప్రత్యేక వార్డులో ఆమె  చాలా కాలం పనిచేశారు. జయ మృతిచెందిన డిసెంబర్‌ ఐదో తేదీన నళిని విధుల్లో ఉన్నారు. అలాగే, నర్సు ప్రేమ ఆంథోని జయలలిత చికిత్సలందుకున్న స్పెషల్‌ వార్డులో నర్సులపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపారు. ఇదిలాఉండగా వీరిరువురూ ఇచ్చిన సమాధానాలతో న్యాయమూర్తి ఆర్ముగస్వామి అసహనానికి గురైనట్టు సమాచారం.

మరిన్ని వార్తలు