న్యూఢిల్లీ/లూథియానా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ పర్యటనకు బయల్దేరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం శతాబ్ది ఎక్స్ప్రెస్లో లూథియానా వెళ్లేందుకు ఢిల్లీలోని రైల్వే స్టేషన్కు వచ్చిన కేజ్రీవాల్ను ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకొని గాజులతో నిరసన తెలిపారు. పోలీసులను తోసివేస్తూ కేజ్రీవాల్ ఎక్కిన బోగీ వద్దకు వచ్చిన కార్యకర్తలు..
మహిళతో రాసలీలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సందీప్కుమార్తో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలున్న ఆప్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కాగా, లూథియానాకు చేరుకున్న కేజ్రీవాల్కు అక్కడి రైల్వేస్టేషన్లో శిరోమణి అకాలీదళ్ యువజన, కాంగ్రెస్ మహిళా విభాగాల నుంచి నిరసన ఎదురైంది. అనంతరం రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన ఆయన్ని ఓ హిందూ సంస్థకు చెందిన ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.