సీఎంపై 'సమోసా' కుంభకోణం!

11 Apr, 2017 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ : మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ ఆప్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు తాజాగా ’సమోసా’ చిక్కు వచ్చి పడింది. మరోసారి సీఎంపై  బీజేపీ విమర్శల అస్త్రం ఎక్కుపెట్టింది. ముఖ్యమంత్రి చాయ్‌ సమోసాలకు ప్రజల సొమ్ము అక్షరాలా కోటి రూపాయిలు ఖర్చుపెట్టారంటూ బీజేపీ అధికార ప్రతినిధి తాజీందర్‌ పాల్‌ సింగ్‌ నగరం మొత్తం పోస్టర్లతో ప్రచారానికి తెరతీశారు. అంతకు ముందు ఆప్‌ తన ప్రధాన ప్రతిపక్షం బీజేపీపై ఆరోపణాస్త్రాలు సంధిస్తే ...దానికి ప్రతిగా బీజేపీ కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది.

వచ్చిన అతిథుల కోసం 18 నెలల కాలంలో ప్రభుత్వం కేవలం చాయ్ సమోసాల సప్లై కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చుపై  ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే గత ఏడాది డీటీటీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు విందు కార్యక్రమాలకు రూ.11 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన విమర్శించారు.  దీనిపై జ్యుడిషియల్‌ విచారణ చేపట్టాలన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ-ఆప్‌ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి.

మరోవైపు ఈ ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తోసిపుచ్చారు. ఆ విందుకు సంబంధించి ఖర్చు చేసిన ఫైల్‌ను తాను వెనక్కి తిప్పి పంపించినట్లు తెలిపారు. గత ఆరు నెలలుగా ఆ ఫైల్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలోనే ఉందన్నారు. అయితే బీజేపీ ఒత్తిడి చేయడం వల్లే ఈ వివరాలు బయటకు వచ్చాయంటూ ఆయన మండిపడ్డారు.  కాగా ఆప్‌ సర్కార్‌ చాయ్‌-సమోసా ఖర్చు కోటి దాటిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి అయిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు