అమ్మ కోసం ఆస్తులిచ్చేస్తా!

10 Sep, 2016 08:29 IST|Sakshi
అమ్మ కోసం ఆస్తులిచ్చేస్తా!

సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత పేరున ప్రజలకు సేవలందించేందుకు అవసరమైతే తన ఆస్తులు మొత్తాన్ని దానం చేస్తానని చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దురైస్వామి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు వచ్చేనెల 24వ తేదీలోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్ తుది సమావేశం గురువారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అమ్మ ఉచిత కల్యాణ మండపాలు వివాహాలు, నామకరణ మహోత్సవాలు తదితర అనేక శుభకార్యాలతో పేదలకు చేరువయ్యాయని తెలిపారు.
 
 గత పదేళ్ల కాలంలో మొత్తం 65వేల శుభకార్యాలు ఆయా మండపాల్లో చోటుచేసుకున్నాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఏ ఉద్దేశంతోనైతే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో దానిని మనస్సులో ఉంచుకుని ప్రజాసేవ చేస్తున్నానని అన్నారు. అలాగే అమ్మ దయవల్ల చెన్నై కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైనానని చెప్పారు. తన మనిదనేయ ట్రస్ట్‌లో విద్యన భ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్యావంతులై ఈరోజు కార్పొరేషన్‌లో తన కింద పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
 
  ఇలాంటి మంచి అవకాశం కేవలం అమ్మ వల్లనే తనకు కలిగిందని చెప్పారు. అమ్మ తనను మేయర్‌ను చేయకుంటే ప్రజల సేవల చేసే భాగ్యం కలిగి ఉండేది కాదని అన్నారు. ఇలా ఒకటిని మించి ఒకటిగా తనకు మేలు చేసిన అమ్మ కోసం తన యావదాస్తిని దానం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు అమ్మకు రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అమ్మ ప్రవేశపెట్టిన పథకాలను పేరు పేరునా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
 
 విపక్షాల వాకౌట్:
 కార్పొరేషన్ తుది సమావేశంలో డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పాల్గొనగా మేయర్ సైదై దొరస్వామి ఆద్యంతం ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తుతించడంతోనే సరిపెట్టడంపై విపక్షాలను విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో 110వ విధి కింద ప్రకటించిన పథకాలను వరుసగా పేర్కొంటూ జయలలితపై పొగడ్తల వర్షం కురిపిస్తుండగా ప్రతిపక్ష నేత  సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో విపక్ష సభ్యులంతా లేచి నిలబడి నిరసన నినాదాలు చేశారు. మేయర్ తన ప్రసంగంలో డీఎంకే అధ్యక్షులు కరుణానిధిపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు.
 

మరిన్ని వార్తలు