ఇక ‘అమ్మ’ కల్యాణ మండపాలు

17 Sep, 2016 13:26 IST|Sakshi
ఇక ‘అమ్మ’ కల్యాణ మండపాలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే అమ్మ బ్రాండ్లతో తరిస్తున్న ఆ  రాష్ట్ర ప్రజలకు పురచ్చి తలైవీ శనివారం మరో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. తమిళనాడు ప్రజలకు ఇక అమ్మ కల్యాణ మండపాలు అందుబాటులోకి రానున్నాయి.  ఇందులో భాగంగానే రూ.83కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో ఈ కల్యాణ మండపాలను ప్రభుత్వం నిర్మించనుంది. కల్యాణ మండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పేద, సామాన్య  ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జయలలిత తెలిపారు.  

రాష్ట్ర హౌసింగ్ బోర్డు,సహకార సంఘాలు ఆధ్వర్యంలో మండపాల నిర్మాణం చేపట్టనుంది. వరుడు,వధువులతో పాటు అతిథి గదులు, భోజనశాల, వంటగది ఉండే ఈ కల్యాణ మండపాలలో ఎయిర్ కండిషనర్ సదుపాయం కూడా ఉంటుంది.  తోండియార్ పేట, వెలాచెరి, అయపాక్కం, పెరియార్ నగర్, కొరట్టార్ (చెన్నై), అన్నానగర్ (మధురై), అంబ సముద్రం (తిరునల్వేలి), సేలం, కొడున్గైయార్( తిరువళ్లూరు), వడమాలైపేట (తిరుపూర్)లో కల్యాణ మండపాలు నిర్మాణం చేపట్టనుంది. అలాగే మురికివాడల్లో పేదల కోసం రూ.1800 కోట్లతో 50వేల గృహాలు నిర్మించనున్నట్లు జయలలిత ప్రకటన చేశారు. కాగా జయ...ఆ రాష్ట్ర ప్రజలకోసం ‘అమ్మ’ క్యాంటీన్లు, ‘అమ్మ’ వాటర్, ‘అమ్మ’ కూరగాయలు, ‘అమ్మ’ మెడికల్ షాపులు,‘అమ్మ’ సిమెంట్, ‘అమ్మ’ ఉప్పు అమ్మ జిమ్లు ... ఇలా పలు పథకాలు ప్రారంభించి ప్రజల మన్ననలు పొందుతున్నారు.

మరిన్ని వార్తలు