ఆ చిత్రాన్ని జీవితంలో మరచిపోలేను

14 Feb, 2016 03:26 IST|Sakshi
ఆ చిత్రాన్ని జీవితంలో మరచిపోలేను

 ఏ చిత్రం ఎప్పుడు ఎవరికి లైఫ్‌గా మారుతుందో చెప్పలేం. బాహుబలి చిత్రం నిర్మాణ సమయంలో అందరూ అందులో నటిస్తున్న నటి అనుష్క గురించే చెప్పుకున్నారు. అయితే మధ్యలో వచ్చి చేరిన తమన్నాకు ఆ చిత్రం లైఫ్ ఇచ్చింది. అవును ఆ మిల్కీబ్యూటీ నట జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అన్నట్టుగా మారిపోయింది. తమన్న ఇక తెరమరుగే అనుకుంటున్న సమయంలో బాహుబలి చిత్ర అవకాశం రావడం అందులో వీరనారి పాత్రకు తనదైన నటనతో ప్రాణం పోయడం, దానికి ప్రేక్షకుల ఆదరణతో పాటు పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురవడం తద్వారా తమన్న మళ్లీ లైమ్‌టైమ్‌లోకి రావడం జరిగిపోయింది.
 
  తన జీవితంలో ఇలాంటి మలుపు ఏర్పడుతుందని తమన్నా కూడా ఊహించి ఉండరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.అందులో ఒకటి దోస్త్(టైటిల్‌ను అధికారికంగా వెల్లడించలేదు).తెలుగులో ఊపిరిగా రానున్న ఈ ద్విభాషా చిత్రంలో నాగార్జున, కార్తీలలో కలిసి నటిస్తున్నారు. చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల తమన్నా ఒక భేటీలో మాట్లాడుతూ తన భావాలను వ్యక్తం చేశారు. అవేమిటో చూద్దాం.నేను నటినైనందుకు సంతోషిస్తున్నాను. సినిమా రంగంలో నిత్యం కొత్తకొత్త అనుభవాలను చవిచూస్తున్నాను.అలాగే ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరిత పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది.బాహుబలి చిత్రాన్ని నా జీవితంలో మరచి పోలేను.
 
 అందులో చాలా కష్టపడి నటించాను.అందుకు ఫలితం లభించింది.ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. ప్రస్తుతం బాహుబలి-2 లో నటిస్తున్నాను.మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటించడం వల్లే ఇక్కడ నిలబడగలుగుతున్నాను.నాకు దేవుడిపై అపార నమ్మకం ఉంది.ఆయన కృపాకటాక్షాల వల్లే నేనీ స్థాయికి చేరుకోగలిగాను.నాకు ఇష్టమైన దేవుడు సిద్ధి వినాయకుడు. నిత్యం ఆయనకు ప్రణమిల్లి షూటింగ్‌కు బయలు దేరతాను. నాకు అత్యాశలేమీ లేవు.ప్రస్తుత స్థాయిని నిలబెట్టుకుంటే చాలు. భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమైతే ఎవరికి కావలసింది వారు కోరుకుంటామంటారు.నేను మాత్రం ఏమీ కోరుకోను.ఎందుకంటే నాకు కావలసి దానికంటే ఎక్కువే ఆయన అందించారు.అందుకని కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకుంటాను.
 

>
మరిన్ని వార్తలు