బారాపులా మూడో దశకు శంకుస్థాపన

23 Dec, 2014 23:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బారాపులా కారిడార్‌ను సరాయ్ కాలేఖాన్ నుంచి మయూర్‌విహార్  వరకు పొడిగించడం కోసం పీడబ్ల్యూడీ రూపొందించిన ‘బారాపూలా’ప్రాజెక్టుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. మయూర్  విహార్‌లో జరిగిన  శంకు స్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, తూర్పుఢిల్లీ ఎంపీ మహేష్‌గిరీ హాజరయ్యారు. బారాపులా మూడోదశ కింద చేపట్టిన ఈ ప్రాజె క్టు నిర్మాణ పనులు వచ్చే సంవత్సరం మార్చిలో మొదలై  2017 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, 2018 జనవరి నుంచి ఈ కారిడార్‌పై వాహనాలు తిరుగుతాయని పీడబ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు. మూడో దశ కింద బారాపులా కారిడార్ విస్తరణకు 1,260 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పీడబ్ల్యూడీ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు కింద నాలుగు లేన్ల క్యారే జ్‌వేను సైకిల్ ట్రాకులు, ఫుట్‌పాత్‌లతో నిర్మిస్తారు. 2020 నాటికి బారాపులా కారిడార్‌ను 1లక్షా 50 వేల వాహనాలు ఉపయోగిస్తాయని అధికారులు అంటున్నారు.
 
 మొదటి దశలో సత్ఫలితాలు..
 సరాయ్‌కాల్ ఖాన్ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ స్డేడియం వరకు మొదటి దశ కింద నిర్మించిన కారిడార్‌ను 70 వేల కార్లు ఉపయోగిస్తున్నట్లు గత సంత్సరం జరిపిన అధ్యయనంలో తేలింది. రెండో దశ కింద కారిడార్‌ను జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ఐఎన్‌ఏ వరకు పొడిగించారు. ఈ దశ కింద చేపట్టిన నిర్మాణం 2015  డిసెంబర్  వరకు పూర్తవుతాయని అంచనా,  రెండో దశ నిర్మాణం పూర్తయిన తరువాత కారిడార్‌ను ఉపయోగించుకునే వాహనాల సంఖ్య లక్షకు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. నాలుగో దశ కింద బారాపులా కారిడార్‌ను దౌళాకువా, ఢిల్లీ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు త్వరలో అధ్యయనం చేపట్టనున్నారు.
 

మరిన్ని వార్తలు