చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిమయం

2 Nov, 2016 13:52 IST|Sakshi
చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిమయం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అవినీతి మితిమీరిపోయిందని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలన చూసి వ్యాపారం పెట్టేందుకు భయపడుతున్నారని విమర్శించారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని.. అవినీతి, దోపిడీ, ఇసుక మాఫియాలోనే రాష్ట్రం నెంబర్ వన్ అని అన్నారు.

ప్రజా ప్రయోజనాలను చంద్రబాబు ఫణంగా పెట్టినందుకు సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు షరతులకు చంద్రబాబు బసవన్నలా తల ఊపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏం సాధించారని ఫస్ట్ ర్యాంకు ఇచ్చారని ప్రశ్నించారు. కొత్తగా పరిశ్రమలు రాకున్నా, వస్తున్నట్టుగా చంద్రబాబు ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు.  సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి ర్యాంకు సాధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు