ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

20 Jun, 2017 05:10 IST|Sakshi
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రియుడి మృతి
ప్రియురాలి పరిస్థితి విషమం

టీనగర్‌: తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట విషం సేవించి ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ప్రేమికుడు మృతిచెందగా, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. తిరుచ్చి పొన్‌మలై జీకార్నర్‌ సమీపంలో పశు వధశాల ఉంది. దీని వెనుక భాగాన సోమవారం ఉదయం 6గంటల సమయంలో యువతి, యువకుడు నోట్లో నురగలు కక్కుతూ  అపస్మారక స్థితిలో పడిఉన్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా యువకుడు మృతి చెందినట్లు తెలిసింది. యువతిని వెంటనే చికిత్స నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. మృతి చెందిన యువకుడు ప్రకాష్‌(21), ఈరోడ్‌ జిల్లా చిత్తోడ్‌ సమీపం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఇతను తిరుచ్చి లా కళాశాలలో మూడో సంవత్సరం పూర్తిచేశాడు. ప్రకాష్, ఈ రోడ్‌కు చెందిన విద్యార్థిని అక్షయ పరస్పరం ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. అక్షయ ఈరోడ్‌లో ప్లస్‌టూ చదువుతోంది.

అరుంధతీయ వర్గానికి చెందిన ప్రకాష్‌ ప్రేమ వ్యవహారానికి కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీనిగురించి ప్రకాష్, అక్షయతో తెలిపాడు. ఈ స్థితిలో ఆదివారం ఇరువురూ ఈరోడ్‌ నుంచి రైల్లో తిరుచ్చి చేరుకున్నారు. అక్కడ విషం సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుని ఇద్దరూ కలిసి విషం తాగారు. ఈ స్థితిలో ప్రకాష్‌ మృతిచెందాడు. అక్షయ అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ  సంఘటనపై పోలీసులు ఇరు కుటుంబాలకు సమాచారం అందించడంతో వారు తిరుచ్చికి చేరుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు