బళ్లారి కాంగ్రెస్‌లో అధిపత్య పోరు

10 Nov, 2013 03:03 IST|Sakshi

 

 = ఎమ్మెల్యే అనిల్‌లాడ్, మాజీ మంత్రి దివాకర్‌బాబు వర్గీయులు బాహాబాహీ
 = గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో  కేసు నమోదు

 
 సాక్షి, బళ్లారి : బళ్లారి నగర, జిల్లా కాంగ్రెస్‌లో అధిపత్యం కోసం ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరికి వారు ఎత్తులు వేసుకుంటూ ముందుకెళుతున్నారు. బళ్లారి జిల్లా కాంగ్రెస్ వర్గ విభేదాలు ఇప్పటివి కాకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విభేదాలు రోజురోజుకీ తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి నగరంలోని మయూర హోటల్ వద్ద మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు, బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అనిల్‌లాడ్‌కు మద్దతు ఎందుకు ఇస్తున్నావ్ అని కొందరు, దివాకర్‌బాబు వెంట ఎందుకు వెళుతున్నావు? అని మరికొందరు వాదోపవాదాలు చేసుకుని చివరకు పరిస్థితి చేయి చేసుకునేదాకా వెళ్లింది. దీంతో పోలీసు స్టేషన్‌లో ఒకరికిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి బళ్లారిలో వర్గ విభేదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని చెప్పవచ్చు. బళ్లారి సిటీ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ తరుపున 26 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. వీరిలో సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్‌కు మద్దతుగా ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా, మిగిలిన వారందరూ మాజీ మంత్రి దివాకర్‌బాబు వర్గీయులుగా ఉన్నారు.

రెండు రోజుల క్రితం దివాకర్‌బాబు జన్మదినోత్సవ వేడుకలను ధూంధాంగా చేశారు. సిటీలో ఎక్కడ చూసినా దివాకర్‌బాబు ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయించి తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. గత 12 సంవత్సరాల నుంచి దివాకర్‌బాబు బర్త్ డే ఊసే ఎత్తని ఆ పార్టీ కార్యకర్తలు ఈసారి నగరంలో హల్‌చల్ చేశారు. త్వరలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తుండటంతో దివాకర్‌బాబు ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు తన వెంట మొత్తం కార్పొరేటర్లందరూ ఉన్నారనే సంకేతాలు పంపారు.

ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ ముఖ్యులు  అనిల్‌లాడ్, దివాకర్‌బాబు, కేసీ.కొండయ్య, జే.ఎస్.ఆంజనేయులు ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బళ్లారి నగర మేయర్, ఉపమేయర్ ఎన్నికలెప్పుడు వచ్చినా దివాకర్‌బాబు వర్గీయులే మేయర్‌గా ఎన్నికవుతారనేది నగ్న సత్యం. ఇవన్నీ పార్టీ హైకమాండ్‌కు చేరవేసి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకునేందుకు బాబు వర్గీయులు ఎత్తులు వేస్తున్నారు. కేసీ.కొండయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలంలో స్వంత భవనం కడుతున్నారనే ఆరోపణలు రావడంతో అనిల్‌లాడ్, ముండ్లూరు దివాకర్‌బాబులు ఇద్దరు కేసీ కొండయ్య చేస్తున్నది తప్పు అని ప్రకటనలు ఇవ్వడం విశేషం.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పరమేశ్వర్ నాయక్ కొనసాగుతున్నారు. ఆయన హడగలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హడగలి బళ్లారి  నగరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన నియోజకవర్గం నుంచి బళ్లారికి వచ్చిపోయేది చాలా అరుదు. జిల్లాలో ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే మంత్రి మద్దతు ఇస్తున్నారనేది కాంగ్రెస్ వర్గీయుల ఆవేదన. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఒక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గం కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు