బెంగళూరులో కొత్తగా 981 కేసులు
నగరంలో కోవిడ్ మరణాల సంఖ్య 156
బెంగళూరు: కోవిడ్ కేసులకు నగరాలు నిలయంగా మారాయి. అనేక రాష్ట్రాల్లోనూ నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా నగరాల్లోనే తిష్ట వేశాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్ మోగుతుండటంతో అక్కడి ప్రభుత్వం 33 గంటల లాక్డౌన్ ప్రకటించింది. ఇది శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. అయినప్పటికీ కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. సోమవారం కొత్తగా 981 కేసులు వెలుగుచూడటంతో ఒక్క బెంగళూరులోనే మొత్తం కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటింది. (రూ.10వేలకే ఆక్సిజన్ యంత్రం! )
ప్రస్తుతం ఈ నగరంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 10,561 కాగా ఇందులో 8860 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1843 కేసులు బయటపడగా, 30 మంది మరణించారని సోమవారం సాయంత్రం కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 25,317కి చేరింది. ఇందులో 14,385 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 మంది కోవిడ్తో మరణించగా ఒక్క బెంగళూరులో 156 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. (బెంగళూరులో 33 గంటల లాక్ డౌన్)