వేసవిలో చలో.. చిక్కమగళూరు

11 May, 2019 12:46 IST|Sakshi

ప్రఖ్యాతి గాంచిన శృంగేరి శారదపీఠం ఇక్కడే

ఆకట్టుకుంటున్న వేసవి పర్యాటకం

సాక్షి బెంగళూరు : వేసవి విడిదికి, పర్యాటకానికి చిక్కమగళూరు జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని చెప్పవచ్చు. తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం.. నిత్యం వర్షాలు కురుస్తుండటం.. చల్లటి వాతావరణం ఉండటంతో వేసవి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి చిక్కమగళూరుకు పర్యాటకులు తరలివస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోనే పచ్చదనానికి నిలయంగా మారడంతో వేసవి కాలంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది.  

ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు..
బాబా బుడాన్‌గిరి
ముస్లిం పేరుతో చిక్కమగళూరు జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతం కావడం విశేషం. కుల మతాలకు అతీతంగా బాబా బుడాన్‌గిరి ప్రాంతాన్ని ఆదరిస్తారు. హిందూ, ముస్లి, క్రైస్తవులు పర్యాటకానికి వస్తారు. దత్తాత్రేయ పీఠం, బాబా బుడాన్‌ గిరి దర్గా ఎక్కువ ప్రసిద్ధి.

హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం  
భద్రనది తీరాన ఉండే హిందూ దేవాలయంగా హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం ప్రసిద్ధి గాంచింది. పశ్చిమ కనుమల భాగంలో ఉంటుంది. శాంతియుత వాతావరణం, అన్నదానం తదితర కార్యక్రమాలకు ప్రసిద్ధి.

హీరేకొలాల్‌ సరస్సు
మానవ నిర్మిత శాంతికి ప్రతీకగా హీరేకొలాల్‌ సరస్సును పిలుస్తారు. చుట్టూ కొండ ప్రాంతాలు ఉంటాయి. మేఘాలు, మంచుతో కప్పుకుని అందంగా కనిపిస్తాయి.

శృంగేరి శారదా పీఠం  
ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్య శృంగేరి శారదా పీఠం ఆరంభించారని చెబుతారు. తుంగానది తీరంలో ఉంది. చిక్కమగళూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో టాప్‌10 జాబితాలో ఉందని చెప్పవచ్చు.

ముల్లాయనగిరి
చంద్రద్రోణి కనుమల్లో ఉంది. భూ ఉపరితలానికి 1,950 మీటర్ల ఎత్తులో ఉంది. కర్ణాటకలోనే ఎత్తైన పాంతం. పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి. వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తారు. సూర్యాస్తమయం, నంది విగ్రహం ఆకట్టుకుంటాయి.  కుద్రేముఖ్‌ – చిక్కమగళూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కుద్రేముఖŒ ఒకటి అని చెప్పవచ్చు. పచ్చని కొండ ప్రాంతాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఆకుపచ్చని తివాచీగా పర్యాటకులు భావిస్తారు. కొండల మధ్యలో జలపాతాలు కనువిందు చేస్తాయి. కాదంబి వాటర్‌ ఫాల్స్‌ చూడదగ్గ ప్రాంతాలు.

వీరనారాయణ దేవస్థానం
ప్రాచీన పురాతన ఆలయాల్లో వీరనారాయణ దేవస్థానం ఒకటి. క్రీ.శ.12వ శతాబ్డంలో హొయసాల రాజులు నిర్మించారు. ప్రాచీన సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు.

జెడ్‌ పాయింట్‌  
ప్రకృతి అందాల నిలయంగా జెడ్‌ పాయింట్‌ను పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో భాగమై ఉంది. జెడ్‌ పాయింట్‌ కొండను సులభంగా ఎక్కవచ్చు. బెంగళూరు నుంచి ప్రైవేటు రవాణా సంస్థల ద్వారా చేరుకోవచ్చు. 

మరిన్ని వార్తలు