దీపావళి బరిలో కమల్‌తో ఢీకుంటున్న అజిత్

29 Oct, 2015 03:13 IST|Sakshi
దీపావళి బరిలో కమల్‌తో ఢీకుంటున్న అజిత్

దీపావళి బరిలో విశ్వనాయకుడు కమలహాసన్‌తో అజిత్ ఢీకుంటున్నారు. పెద్ద పండగలు వస్తున్నాయంటే చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణం, సినీ అభిమానుల్లో ఆనందాలు నెలకొంటాయి. అయితే దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగల సందర్భాల్లోనే భారీ చిత్రాలు విడుదల చేయాలన్న నిర్మాతల మండలి నిబంధన అమలులో ఉంది. కాగా ఈ దీపావళికి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి కమలహాసన్ నటించిన తూంగావనం కాగా రెండోది అజిత్ నటించిన వేదాళం. దీంతో కమల్, అజిత్ మధ్య పోటీ అనివార్యమయ్యింది.
 
 తూంగావనం..
 పాపనాశం వంటి విజయవంతమైన చిత్రం తరువాత విశ్వనాయకుడు కమలహాసన్ నటించి, తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన చిత్రం తూంగావనం. ఇది ఏక కాలంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం. తెలుగులో చీకటిరాజ్యం పేరుతో విడుదల కానుంది. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నాయకిగా నటించారు. ప్రకాశ్‌రాజ్, కిషోర్, ఆశాచరణ్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి కమలహాసన్ శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
 వేదాళం..
 ఎన్నైఅరిందాల్ వంటి హిట్ చిత్రం తర్వాత అజిత్ నటించిన భారీ చిత్రం బేదాళం. ఈయనతో ఇంతకుముందు ఆరంభం, ఎన్నైఅరిందాల్ చిత్రాలను నిర్మించిన శ్రీసాయి రామ్ ఫిలింస్ అధినేత ఏఎం.రత్నం నిర్మించిన మరో భారీ చిత్రం ఇది. అదే విధంగా ఇంతకు ముందు అజిత్‌తో వీరం వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన శివ తెరకెక్కించిన చిత్రం బేదాళం. ఇందలో శ్రుతీహాసన్ హీరోయిన్. అజిత్‌కు చెల్లెలుగా నటి లక్ష్మీమీనన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం కుటుంబ నేపథ్యంలో సాగే కమర్షియల్ కథా చిత్రంగా రానుంది. విశేషం ఏమిటంటే ఈ దీపావళికి తండ్రీకూతుళ్ల చిత్రాలు పోటీ పడుతున్నాయన్న మాట. మరి ఈ రెండింటిలో ఏది ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో, ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తాయో వేచి చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు