బీజేపీ నేత హత్య

13 May, 2015 02:45 IST|Sakshi

టీనగర్: ముత్తుపేట సమీపంలో బీజేపీ నేత ఒకరు హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి అతని స్నేహితులు సహా నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరువారూరు జిల్లా ముత్తుపేటై సమీపంలోగల ఉదయమార్తాండపురానికి చెందిన ఫకీర్‌సామి కుమారుడు వెంకటేష్ (24). ఉదయ మార్తాండపురం బీజేపీ డివిజన్ అధ్యక్షుడుగా ఉంటున్న ఈయన అదే ప్రాంతంలో పెట్రోల్ బంకు నడుపుతున్నాడు. ఇతని స్నేహితులు సిద్ధమల్లి, విజయేంద్రన్ (23), తోలి గ్రామానికి చెందిన మరుదపాండి (24).   కొద్ది రోజుల క్రితం విజయేంద్రన్ గురించి మరుదపాండి వద్ద వెంకటేష్ తప్పుడు సమాచారం తెలిపాడు.

దీంతో మరుదపాండి విజయేంద్రన్‌కు ఈ విషయం తెలిపాడు. దీంతో విజయేంద్రన్, వెంకటేష్ మధ్య శత్రుత్వం ఏర్పడింది. దీనికి సంబంధించి వారు ఫోన్‌లోనే వాగ్వాదించుకున్నారు. సోమవారం రాత్రి వెంకటేష్ పెట్రోల్ బంకులో ఉన్నాడు. 11 గంటల సమయంలో మరుదపాండి , విజయేంద్రన్ అక్కడకు వచ్చి వెంకటేష్‌తో గొడవకు దిగి అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి వెంకటేష్ తప్పించుకుని పరుగులు తీశాడు.

ఆ సమయంలో బంకు వెలుపల నిలుచున్న ఇద్దరు వ్యక్తులు వెంకటేష్‌పై కత్తులతో దాడి చేశారు. దీంతో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎడయూరు పోలీసులు అక్కడికి చేరుకుని వెంకటేష్ మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం తిరుతురైపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు